Sajjala Ramakrishna Reddy: సీబీఐ కౌంటర్ లో జగన్ పేరు ప్రస్తావించడం ఓ పిల్ల చేష్ట: సజ్జల 

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • తెలంగాణ హైకోర్టులో అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
  • సీఎం జగన్ పేరు ప్రస్తావించిన సీబీఐ
  • సీబీఐ తీరును తప్పుబట్టిన సజ్జల
  • సంచలనం కోసమే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యలు
Sajjala opines on CBI mentioning CM Jagan name in counter

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ పేరును కూడా అందులో ప్రస్తావించింది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఈ విచారణ సందర్భంగా సడన్ గా సీఎం జగన్ పేరు ప్రస్తావించారని, కౌంటర్ లో సీఎం జగన్ పేరును పేర్కొనడం చిల్లర, పిల్ల చేష్టగా అనిపించిందని విమర్శించారు. ఈ వ్యవహారంలో జగన్ పేరును అకస్మాత్తుగా తీసుకురావడం సహేతుకంగా లేదని, సంచలనం కోసం ఇలా చేస్తున్నట్టుందని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఎందుకు సంచలనాత్మకం చేయాలనుకుంటున్నారో సీబీఐనే చెప్పాలని స్పష్టం చేశారు. 

అవినాశ్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని దర్యాప్తు పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఇందులో అకారణంగా సీఎం అంతటి వ్యక్తి పేరును తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని బాధ్యతా రాహిత్యంతో కూడిన చర్య అని భావించవచ్చని అన్నారు. 

జగన్ ను ఈ కేసులోకి తీసుకురావడం సీబీఐకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదని సజ్జల వ్యాఖ్యానించారు. దీనివెనుక కుట్ర ఉందని, కుట్రకు పాల్పడిన వాళ్లు బయటికి రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

More Telugu News