Chandrababu: మహానాడుకు రావాలంటూ డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్న చంద్రబాబు

  • ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు
  • రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో మహానాడు
  • మహానాడుకు భారీగా తరలి వస్తారని అంచనా
  • మహానాడులో అన్ని అంశాలపై చర్చిస్తామని వెల్లడి
  • మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని ప్రకటన
Chandrababu invites to Mahanadu

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరపనున్నారు. ఈ నెల 27న ప్రతినిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. 

కాగా, ఈ టీడీపీ ప్లీనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున తరలి వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో, మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్నారు. 

తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు నాంది పలికారని కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి (మే 28) రోజు మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని తెలిపారు. 

రాజమండ్రి మహానాడులో అన్ని అంశాలపై చర్చలు ఉంటాయని అన్నారు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ చేపడతామని పేర్కొన్నారు. మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.

More Telugu News