Swiggy: లక్నో టీమ్ ను ట్రోల్ చేసిన స్విగ్గీ

  • ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబైతో ఓడిన లక్నో
  • లక్నోకు టిష్యూ పేపర్లు పంపిస్తామంటూ స్విగ్గీ ట్వీట్
  • మామిడి పండ్లతో నవీనుల్ హక్ ను ట్రోల్ చేసిన ముంబై ప్లేయర్లు
Swiggy Trolls Lucknow After IPL Qualifier Loss

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక ఎలిమినేటర్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయింది. ముంబై ముందుకు దూసుకెళ్లగా.. లక్నో ఇంటిబాట పట్టింది. అయితే మ్యాచ్ సమయంలో కాస్త అతి చేసిన లక్నో బౌలర్ నవీనుల్ హక్ పై నెటిజన్లు బీభత్సమైన ట్రోలింగ్ కు దిగారు. గతంలో కోహ్లీతో గొడవ, ఆర్సీబీ ఓడిపోయినప్పుడు ఇన్ స్టా చేసిన పోస్టులకు ఇప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. వీరికి స్విగ్గీ కూడా జత కలిసింది.  

నిన్న లక్నో ఓడిపోవడాన్ని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ ట్రోల్ చేసింది. ‘‘అబ్బాయిలూ టెన్షన్ పడకండి.. మేము లక్నోలో టిష్యూలను రీస్టాక్ చేయడం ప్రారంభించాం’’ అని ట్వీట్ చేసింది. ‘లక్నో ఓడిపోయిందని ఏడ్చే వాళ్లకు టిష్యూ పేపర్లను ఇస్తాం’ అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వేలాది మంది కామెంట్లు చేస్తున్నారు. 

‘‘ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా హ్యాపీ.. నో వర్రీస్’’ అని ఒకరు.. ‘‘నిప్పుతో ఆడుకుంటున్నావు స్విగ్గీ.. అయినా మంచి జోక్’’ అని మరొకరు కామెంట్లు చేశారు. ‘మామిడి పండ్లు కూడా రీస్టాక్ చేయి స్విగ్గీ’ అని ఇంకొకరు రాసుకొచ్చారు. ‘‘ఇలాంటి ట్వీట్లు చేస్తే.. లక్నోలో నీ వ్యాపారం దెబ్బతింటుంది చూస్కో’’ అని ఓ యూజర్ హెచ్చరించారు.

మరోవైపు ఎలిమినేటర్‌లో ముంబై విజయం తర్వాత ముంబై ప్లేయర్లు కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ కలిసి ఒక ఫొటో దిగారు. డైనింగ్ టేబుల్‌పై మామిడి పండ్లు పెట్టిన వాళ్లు.. మూడు కోతుల్లా కళ్లు, చెవులు, నోరు మూసుకొని ఫొటో దిగారు. దీన్ని వినోద్, సందీప్ తమ ఇన్‌స్టా స్టోరీల్లో కూడా షేర్ చేశారు. ఆర్సీబీ ఫెయిలైన ప్రతిసారీ లక్నో పేసర్ నవీనుల్ హక్.. మామిడి పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచాడు. ఈ క్రమంలోనే వినోద్, సందీప్ ఈ ఫొటోను నెట్టింట షేర్ చేశారు. 'స్వీట్ మ్యాంగో సీజన్' అని ఈ ఫొటోకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. మరోవైపు లక్నో ట్విట్టర్ అడ్మిన్ అయితే.. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక 'మ్యాంగో' అనే పదాన్ని మ్యూట్ చేసినట్లు చెప్పాడు.

More Telugu News