Nitesh Pandey: హోటల్‌లో శవమై కనిపించిన బాలీవుడ్ పాప్యులర్ నటుడు నితీశ్ పాండే

  • నాసిక్ సమీపంలోని ఇగత్‌పురీలో షూటింగ్‌లో పాల్గొంటున్న నితీశ్
  • హోటల్ సిబ్బంది, సన్నిహితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
  • తన బావకు గుండె సంబంధిత సమస్యలు లేవన్న బావమరిది సిద్ధార్థ్
Actor Nitesh Pandey Dies At 50 In Nashik Hotel

బాలీవుడ్ పాప్యులర్ నటుడు నితీశ్ పాండే నాసిక్ సమీపంలోని ఇగత్‌పురీలోని ఓ హోటల్‌లో శవమై కనిపించారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ఇగత్‌పురీలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన గుండెనొప్పితో బాధపడినట్టు తెలుస్తోంది. నితీశ్ పాండే మృతి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హోటల్ సిబ్బంది, నితీశ్ సన్నిహితులను ప్రశ్నిస్తున్నారు. ‘ఓం శాంతి ఓం’ సినిమాలో షారూఖ్ ఖాన్‌కు నితీశ్ అసిస్టెంట్‌గా కనిపించారు. 

నితీశ్ మృతిపై ఆయన బావమరిది సిద్ధార్థ్ నాగర్ స్పందించారు. తన బావ ఇక లేరని, విషయం తెలిసిన తన సోదరి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని చెప్పారు. తమకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తాను అనుకోవడం లేదన్నారు. 

నితీశ్ పలు సినిమాలతోపాటు టీవీ షోల్లోనూ కనిపించారు. 1990లలో థియేటర్ నటుడిగా నితీశ్ తన కెరియర్‌ను ప్రారంభించారు. తేజాస్ అనే టీవీ షోతోపాటు ‘అస్తిత్వ.. ఏక్ ప్రమ్ కహానీ’, ‘మంజిలీన్ అప్నీ అప్నీ’, ‘సాయా’, ‘దుర్గేశ్ నందిని’, ‘జస్టాజూ’ వంటి షోలతో పాప్యులర్ అయ్యారు. ఆయన తాజా షో ‘అనుపమ’. అలాగే, బాదాయి దో, షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్, రంగూన్ వంటి సినిమాల్లో నటించారు. షారూఖ్ ఖాన్ సినిమా ‘ఓం శాంతి ఓం’తోపాటు ‘ఖోల్సా కా ఘోల్సా’ మంచి పేరు సంపాదించి పెట్టాయి.

More Telugu News