Supreme Court: అమరావతి ఆర్-5 జోన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

  • ఆర్-5 జోన్లో పట్టాలు ఇస్తే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం
  • హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ తీర్పుకు లోబడి పట్టాల చెల్లుబాటు ఉంటుందని వ్యాఖ్య
  • రైతులు, ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం
Supreme Court on R 5 zone issue

అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్-5 జోన్‌లో పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. హైకోర్టులో పెండింగులో ఉన్న రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని వెల్లడించింది. 

ఆర్-5 జోన్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. రైతులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఆర్-5 జోన్లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదులు పేర్కొనడంతో... ప్లాట్ల కేటాయింపులపై అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. కానీ మూడు రాజధానులపై హైకోర్టు రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాలు ఉంటాయని స్పష్టం చేసింది.

జులైలో విచారణ అనంతరం రిట్ పిటిషన్ తీర్పుకు లోబడి పట్టాల చెల్లుబాటు ఉంటుందని, పట్టాదారుకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని తేల్చి చెప్పింది.

పిటిషనర్ తరఫు వాదనలు

పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రం, దేశ ప్రయోజనాల కోసం రైతులు వేలాది ఎకరాల భూమి ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఒక మహా నగరం వస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని కూడా ఆశ చూపారన్నారు. 29 గ్రామాల ప్రజలు ఆ మాటలు నమ్మినట్లు రైతుల తరఫు న్యాయవాది తెలిపారు. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా భూములు ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వం మాట నమ్మి వేలాది ఎకరాలు ఇచ్చారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధిపై అధికారులు ప్రచారం చేశారన్నారు.

మాస్టర్ ప్లాన్ లో నవనగరాలు ప్రతిపాదించారని, అవి అభివృద్ధి చెందితే ఎన్నో అవకాశాలు వస్తాయని రైతుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రూపురేఖలు మారుతాయన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఐదు శాతం భూములు ఇవ్వాలని రైతుల తరఫు న్యాయవాది అన్నారు. రెసిడెన్షియల్ జోన్ నిబంధనల ప్రకారం కేటాయింపులు ఉండాలని, నవనగరాల్లో ప్రతి నగరంలో రెసిడెన్షియల్ జోన్ ఉందని చెప్పారు. ప్రభుత్వాలు మారితే ఇచ్చిన హామీలు పక్కన పెట్టలేరన్నారు. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

జులైలో తుది విచారణ ఉంటుందని, కానీ అంతకుముందే పట్టాలు ఇస్తే ఏముంటుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. భోజనం విరామం అనంతరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి వాదనలు ప్రారంభమయ్యాయి.

ప్రభుత్వం వాదనలు

భోజన విరామం అనంతరం ప్రభుత్వం తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. 34 వేల ఎకరాల్లో 9 వందల ఎకరాలు మాత్రమే ఈడబ్ల్యుఎస్ కు ఇచ్చినట్లు చెప్పారు. సుప్రీం కోర్టులో ఆర్-5 జోన్ పై వేసిన కేసులు అన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని, వీటిలో ఏవీ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కావన్నారు. ఆర్-5 జోన్ ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, వారి తరఫున తాము వాదనలు వినిపిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత సీఆర్డీఏ తరఫున వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రైతుల నుండి 5 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. ఆర్-5 జోన్ లో ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, పట్టాలు ఇవ్వలేదన్నారు. ప్లాట్ల కేటాయింపు పూర్తయినట్లు లబ్ధిదారులకు తెలియదన్నారు.

పిటిషనర్లు, ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఆర్-5 జోన్ లో పట్టాలు ఇస్తే మాత్రం రిట్ పిటిషన్ పై తుది తీర్పుకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

More Telugu News