ధోనీ రిటైర్ మెంట్ పై చర్చ.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్కే సీఈవో
- నిన్న కోల్ కతాతో మ్యాచ్ లో ఓడిన చెన్నై
- లీగ్ దశలో సొంత మైదానంలో చివరి మ్యాచ్ కావడంతో కలియదిరిగిన చెన్నై ఆటగాళ్లు
- ధోనీకిదే చివరి సీజన్ అని సందేహపడ్డ అభిమానులు
- వచ్చే సీజన్ లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం తమకుందన్న సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్
ఆదివారం రాత్రి కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. లీగ్ దశలో సొంత మైదానంలో చెన్నైకి ఇదే చివరి మ్యాచ్. దీంతో జట్టు ఆటగాళ్లంతా మైదానంలో కలియదిరిగారు. కెమెరాల ఫోకస్ అంతా ధోనీపైనే కనిపించింది. దీంతో ధోనీకి ఇదే చివరి సీజన్ అనే సందేహం అభిమానుల్లో కలిగింది. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. ధోనీ ఆటోగ్రాఫ్ ను తీసుకోవడం ఫ్యాన్స్ లో మరింత ఆందోళన నింపింది.
అయితే తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను సీఎస్కే షేర్ చేసింది. ‘‘వచ్చే సీజన్ లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లప్పుడూ మాకు ఇలానే మద్దతు కొనసాగించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దీంతో కనీసం మరో సీజన్ అయినా ధోనీ ఆడుతాడంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.