Yanamala: జీవో నెం.1 రద్దు జగన్ రెడ్డి మూర్ఖత్వానికి చెంపపెట్టు: యనమల

  • జీవో నెం.1ని కొట్టివేసిన హైకోర్టు
  • ఇది ప్రజాస్వామ్య విజయం అన్న యనమల
  • ఇలాంటి ఎన్ని జీవోలు ఇచ్చినా రాజ్యాంగం రక్షిస్తుందని వెల్లడి 
  • నేటి హైకోర్టు తీర్పు జగన్ కు కనువిప్పు కావాలని సూచన
Yanamala opines on high court dismiss G O No 1

ప్రజా హక్కులు కాలరాసేందుకు ఎన్ని జీవోలిచ్చినా, రాజ్యాంగం ప్రజల్ని రక్షిస్తుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఇవాళ ఏపీ హైకోర్టు జీవో నెం.1ను రద్దు చేయడంపై యనమల స్పందించారు. 

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అడుగులు వేస్తే... న్యాయస్థానాలు, రాజ్యాంగం చూస్తూ ఊరుకోవనే విషయం నేటి హైకోర్టు తీర్పుతో జగన్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేలా జగన్ రెడ్డి తెచ్చిన నల్ల జీవో నెం.1ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయం అని యనమల అభివర్ణించారు. 

"ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు రోడ్డెక్కకూడదు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించకూడదనే నిరంకుశ పోకడతో జీవో తెచ్చి... నేడు కోర్టు మొట్టికాయతో భంగపడ్డారు. ఇప్పటికే జగన్ రెడ్డి తెచ్చిన జీవోలు, తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ఎప్పటికప్పుడు కొట్టేస్తున్నా, ఇంకా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ రోజు హైకోర్టు వెలువరించిన రెండు తీర్పులు కూడా జగన్ రెడ్డి క్రూరత్వాన్ని చాటిచెబుతున్నాయి. జగన్ రెడ్డికి సిగ్గు, శరం ఏమైనా ఉంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణగదొక్కుతా అనేలా వ్యవహరిస్తే ప్రజలు తొక్కిపట్టి నారతీస్తారు" అని యనమల హెచ్చరించారు.

More Telugu News