hyderabad: హైదరాబాద్ లో దారుణం.. అంత్యక్రియలు చేయలేక సోదరుడిని ముక్కలుగా నరికిన అన్నాచెల్లెళ్లు!

  • సోదరుడి శరీరభాగాలను గోనె సంచిలో కుక్కి.. దర్గా దగ్గర పడేసి వెళ్లిన అన్నాచెల్లెళ్లు 
  • సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరినీ పట్టుకున్న పోలీసులు
  • అంత్యక్రియలకు డబ్బుల్లేక అలా చేశామని చెప్పిన నిందితులు
dead body in hyderabad langar house

హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో సొంత సోదరుడిని ముక్కలుగా నరికారు అన్నాచెల్లెళ్లు. తర్వాత గోనె సంచిలో కుక్కి.. ఓ దర్గా దగ్గర పడేసి వెళ్లారు. గురువారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. మద్యానికి బానిసై తమ సోదరుడు చనిపోయాడని, అంత్యక్రియలకు డబ్బుల్లేక ఇలా చేశామని నిందితులు ఇద్దరూ చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.

పోలీసుల విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ కు చెందిన ఆశోక్, రాజు, స్వరూప తోబుట్టువులు. అశోక్ గతంలో డాన్ బాస్కో హాస్పిటల్ లో చికిత్స పొందాడు. చికిత్స చేసినా ఇక లాభం లేదని, ఇంటికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో అశోక్ అనారోగ్యంతో కన్నుమూశాడు.

ఆశోక్ శరీరాన్ని రాజు, స్వరూప కలిసి ముక్కలు ముక్కలుగా చేశారు. గోనె సంచిలో కుక్కి ఆటోలో తీసుకొచ్చి లంగర్ హౌస్ లోని దర్గా దగ్గర పడేశారు. స్థానికులు గమనించి ఏమిటని అడగ్గా.. సమాధానం చెప్పకుండా ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. గోనె సంచిలో డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించారు. ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్ లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది. పోలీసులు ఆ ఇద్దరిని సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు.

ఆశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేక మృతదేహాన్ని పారేయటానికి ముక్కలుగా నరికానని అతని సోదరుడు రాజు విచారణలో వెల్లడించాడు. అతనిపై పోలీసులు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆశోక్ నిజంగానే మద్యానికి బానిసై చనిపోయడా? లేక అన్నాచెల్లెళ్లు కలిసి ఆశోక్ ను చంపేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

More Telugu News