Cyber crime: పెళ్లి సంబంధం అంటూ రిటైర్డ్ ఉద్యోగికి రూ.26 లక్షలు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు

  • ఇద్దరు కుమార్తెల వివరాలు మ్యాట్రిమోనియల్ సైట్ లో ఉంచిన వృద్ధుడు
  • ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అబ్బాయిలతో సంబంధం అంటూ ఎర
  • పలు దఫాలుగా రూ. 26 లక్షలు ఇచ్చి మోసపోయిన రిటైర్డ్ ఉద్యోగి  
Cyber criminals extorted Rs 26 lakhs from a retired employee

దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ. 26 లక్షలు కాజేశారు. సదరు ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహం కోసం ఓ సామాజిక వర్గానికి చెందిన మ్యాట్రిమోనియల్ సైట్ లో వారి వివరాలు నమోదు చేశారు. ఓ సైబర్ నేరగాడు మీ పెద్ద కుమార్తె నచ్చిందని తన కుమారుడికి మ్యాచ్ అవుతుందంటూ ఆయనతో కాంటాక్ట్ లోకి వచ్చారు. తర్వాతి రోజు చిన్న కుమార్తెను మా పెద్దన్నయ్య కుమారుడికి ఇస్తే ఒక్కటే చోట కలిసి ఉంటారంటూ నమ్మించాడు. 

వారం రోజుల పాటు ఇరువైపుల నుంచి ఫోన్లలో మాట్లాడుకున్నారు. ముందుగా ఫోన్ చేసిన వ్యక్తి తన కుమారుడు అమెరికా వెళ్లాలని, ఇద్దరు అమ్మాయిలకు ముందుగానే నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పాడు. ఇందుకు డబ్బులు కావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన రిటైర్డ్ ఉద్యోగి పలు దఫాలుగా రూ. 26 లక్షలు ముట్టచెప్పారు. కానీ, సంబంధం కలుపుకున్న వాళ్లు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి సదరు మ్యాట్రిమోనియల్ సైట్ ను సంప్రదించారు. ఆయన చెప్పిన వివరాలతో తమ వెబ్ సైట్ లో ఎవ్వరూ లేరని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నారు. దాంతో, రిటైర్డ్ ఉద్యోగి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

More Telugu News