Sajjala Ramakrishna Reddy: ఇది ఒక విజయం అనుకోవడం లేదు: సజ్జల

  • ఆర్5 జోన్ పై ఏపీ హైకోర్టులో రైతుల పిటిషన్
  • జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి
  • నిరాకరించిన న్యాయస్థానం
  • అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందన్న సజ్జల
  • అన్యాయమైన డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని వ్యాఖ్యలు
Sajjala opines on high court verdict in farmers petition challenging R5 zone

అమరావతిలోని ఆర్5 జోన్ లో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలు కల్పించే జీవో నెం.45ను వ్యతిరేకిస్తూ రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, రైతుల పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఇవాళ తిరస్కరించడం తెలిసిందే. ఈ జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పు అనుసరించి ఇళ్ల పట్టాల పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. 

దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది తమకు విజయం అని ప్రభుత్వం భావించడం లేదని స్పష్టం చేశారు. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందని తెలిపారు. అన్యాయమైన ఒక డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని అన్నారు. 

రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం అని సజ్జల వివరించారు. కానీ, జనాభా అసమతుల్యత అనే అన్యాయమైన వాదన తీసుకువవచ్చారని విమర్శించారు. 

ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ త్వరలోనే ప్రారంభం అవుతుందని, మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. చట్ట ప్రకారం ఐదు శాతం భూమిని పేదలకు కేటాయించాలన్న నిబంధనను గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని సజ్జల ఆరోపించారు.

More Telugu News