Gujarat: సీఎం ప్రసంగిస్తుండగా కునుకు తీసిన సీనియర్ అధికారిపై వేటు

  • కచ్ భూకంప బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో గుజరాత్ సీఎం ప్రసంగం
  • ముందు వరుసలో కూర్చున్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ కునుకు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • విధుల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారంటూ అధికారి సస్పెన్షన్
Gujarat civic officer suspended for taking a nap during a cms speech

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ప్రసంగిస్తుండగా కునుకు తీసిన ఓ అధికారిపై గంటల వ్యవధిలోనే వేటు పడింది. ముందు వరుసలో కూర్చుని మరీ నిద్రలోకి జారుకున్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. 

2001లో కచ్ జిల్లాలో సంభవించిన భూకంపం బాధితులకు పునరావాసం కల్పించే క్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ ఇటీవల 14 వేల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సీనియర్ అధికారి జిగర్ పటేల్ కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. 

ఆ తరువాత, గంటల వ్యవధిలోనే రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. విధి నిర్వహణలో నిబద్ధత లోపించడం, నిర్లక్ష్యపూరిత ప్రవర్తన, తదితర కారణాలతో అయనను సస్పెండ్ చేసింది. గుజరాత్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1971, రూల్ 5(1)(a) ప్రకారం ఈ చర్య తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉదంతంపై జిగర్ పటేల్ ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News