Madhya Pradesh: భర్త బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దన్నాడని ఆత్మహత్య చేసుకున్న భార్య.. ఇండోర్ లో ఘటన

  • భర్త బలరామ్ తో గొడవపడి గదిలో ఉరేసుకున్న రీనా యాదవ్
  • ఎంతసేపటికీ రీనా బయటకు రాకపోవడంతో తలుపు తట్టిన బలరామ్
  • తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన రీనా
Man In Indore Stops Wife From Going To Beauty Parlour She Commits Suicide

బ్యూటీపార్లర్ కు వెళ్లొద్దని భర్త గదమాయించడంతో మనస్తాపం చెందిన భార్య బలవన్మరణానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇండోర్ కు చెందిన రీనా యాదవ్ ఈ దారుణానికి పాల్పడింది. భర్త బలరామ్ యాదవ్ తో జరిగిన గొడవ కారణంగా తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరామ్ యాదవ్ ఇంట్లోనే కుట్టుపని చేసుకుంటూ భార్య రీనా యాదవ్ తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం రీనా యాదవ్ బ్యూటీ పార్లర్ కు వెళతానని చెప్పగా.. బలరామ్ వద్దన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రేగింది. మాటామాటా పెరిగి గొడవగా మారింది.

భర్త తీరుతో మనస్తాపం చెందిన రీనా యాదవ్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఎంతకీ భార్య బయటకు రాకపోవడంతో బలరామ్ యాదవ్ తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. లోపల ఫ్యాన్ కు ఉరేసుకున్న రీనా యాదవ్ కనిపించింది. చుట్టుపక్కల వాళ్లను పిలిచి రీనాను కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయిందని బలరామ్ యాదవ్ చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని రీనా యాదవ్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, బలరామ్ యాదవ్ ను ప్రశ్నించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

More Telugu News