Priyanka Gandhi: హోటల్ లో స్వయంగా దోసెలు వేసిన ప్రియాంకాగాంధీ.. వీడియో వైరల్

  • కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక
  • మైసూరు మైలారి అగ్రహార రెస్టారెంట్ లో దోసెలు వేసిన వైనం
  • తన కూతురును ఇక్కడకు తీసుకొస్తానన్న ప్రియాంక
Priyanka Gandhi makes dosa in Mysore

వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఇరు పార్టీలకు చెందిన అగ్రశ్రేణి నేతలు ప్రచారం పర్వంలో మునిగిపోయారు. ప్రియాంకాగాంధీ మైసూరులో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నగరంలోని మైలారి అగ్రహార రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్ లోని కిచెన్ లోకి వెళ్లి దోసెలు వేశారు. ఆమె వేసిన దోసెను కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


దీనిపై ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు. ప్రఖ్యాత మైలారి హోటల్ ఓనర్లతో కలిసి దోసెలు వేయడాన్ని ఎంజాయ్ చేశానని ఆమె అన్నారు. తమకు ఇంత మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దోసెలు ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పారు. తన కూతురును ఇక్కడకు తీసుకొచ్చి రుచి చూపిస్తానని అన్నారు.

More Telugu News