Mancherial District: వివాహితకు ఫోన్ లో వేధింపులు.. మంచిర్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య

  • వివాహితకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని ఆరోపణ
  • రాయితో తలను ఛిద్రం చేసిన యువతి కుటుంబ సభ్యులు
  • గతంలో ఇద్దరూ ప్రేమికులు.. తనను కాదని వేరే పెళ్లి చేసుకున్న యువతిపై మహేశ్ ఆగ్రహం
  • తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహేశ్
  • అది చూసి యువతి భర్త ఆత్మహత్య
  • భర్త చనిపోవడంతో తిరిగి పుట్టింటికి చేరిన వివాహిత
Youngster murder in mancherial

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న ఓ యువకుడిని ఓ కుటుంబం బండరాయితో కొట్టి చంపేసింది. రాయితో తలను ఛిద్రమయ్యేలా కొట్టడంతో మహేశ్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. వీధిలో అందరూ చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. ఈ భయానక సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీశాడు. చుట్టూ జనం ఉన్నా ఒక్కరు కూడా ఈ దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం వీడియోలో కనిపిస్తోంది.

ఇందారం గ్రామానికి చెందిన ఓ వివాహితను మహేశ్ కొంతకాలంగా వేధిస్తున్నాడని, అదే ఈ హత్యకు దారితీసిందని ప్రాథమిక సమాచారం. వివాహితకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతున్నాడని తెలుస్తోంది. దీనిపై వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా మహేశ్ వేధింపులు ఆగకపోవడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది.

మంగళవారం బైక్ పై వెళుతున్న మహేశ్ పై వివాహిత కుటుంబ సభ్యులు దాడి చేశారు. కిందపడ్డ మహేశ్ ను బండరాయితో కొట్టడం వీడియోలో కనిపిస్తోంది. పదే పదే తలపై రాయితో మోదడంతో మహేశ్ అక్కడికక్కడే చనిపోయాడు. వేధింపులకు గురైన వివాహిత తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఈ హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

హత్యకు ఇదీ కారణం..
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన మహేశ్, సదరు వివాహిత గతంలో ప్రేమించుకున్నారు. కలిసి తిరిగారు. అయితే, మహేశ్ ను కాదని ఆమె మరో యువకుడిని పెళ్లిచేసుకుంది. దీంతో తనతో సన్నిహితంగా ఉన్నప్పటి వీడియోలను మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ గా మారిన వీడియోలు చూసి ఆ యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోవడంతో తిరిగి పుట్టింటికి వచ్చిన వివాహితను మహేశ్ మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురిచేయడంతో వివాహిత కుటుంబ సభ్యులు ఈ దారుణానికి తెగబడ్డారు.

More Telugu News