ajit pawar: ఇద్దరికి మించి పిల్లలు ఉంటే ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి: ఎన్సీపీ నేత అజిత్ పవార్

  • ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే రాయితీలూ ఇవ్వొద్దన్న అజిత్
  • 35 కోట్ల నుండి 142 కోట్లకు పెరిగిన జనాభా, మనందరిదీ బాధ్యతే అన్న ఎన్సీపీ నేత
  • ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి
MPs MLAs Having More Than Two Children Shouldnt Be Allowed To Contest Polls Ajit Pawar

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ అన్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్... చైనాను అధిగమించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పవార్ మాట్లాడారు.

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఎలాంటి రాయితీలు ఇవ్వరాదన్నారు. ప్రజలకు ఎలాంటి రాయితీలు ఇవ్వకుంటే జనాభా పెరుగుదల విషయంలో మరింత అవగాహన, చైతన్యం వస్తాయని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 35 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 142 కోట్లకు చేరుకుందన్నారు. ఇందుకు మనమంతా బాధ్యులమేనని వ్యాఖ్యానించారు.

దేశ ప్రగతి కోసం ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కనడం మానివేయాలని ప్రతి ఒక్కరినీ కోరారు అజిత్. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

విలాస్ రావు దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు, తాలూకా పంచాయతీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముగ్గురు పిల్లలను కలిగి ఉంటే అనర్హులనే నిర్ణయం తీసుకునే సమయంలో తాము భయపడ్డామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదన్నారు. ఈ అంశం కేంద్రం చేతుల్లో ఉందని గుర్తు చేశారు.

More Telugu News