Chandrababu: వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తా: చంద్రబాబు

  • ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు పర్యటన
  • ఈ సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం సభ
  • రాష్ట్రాన్ని ఒక సైతాన్ పట్టాడన్న టీడీపీ అధినేత
  • రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరని వెల్లడి
  • అందుకు కారణం సైకోనే అని వ్యాఖ్యలు
Chandrababu speech in Markapuram rally

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సాయంత్రం పట్టణంలో ర్యాలీ జరగ్గా, అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ, 2019లో టీడీపీ ఓడిపోయిందని, అప్పటి నుంచి రాష్ట్రాన్ని ఒక సైతాన్ పట్టాడని, ఒక శని దాపురించిందని ఆన్నారు. 

రాష్ట్రంలో ఎవరూ ఆనందంగా లేరని, ఎవరు ఈ బాధలకు కారణం అని ప్రశ్నించారు. సైకోనే అందుకు కారణం అని, సైకో అనేందుకు ఓ కారణం ఉందని వెల్లడించారు. పిచ్చోడి చేతికి రాయిస్తే తననైనా కొట్టుకుంటాడు, మిమ్మల్నయినా కొడతాడు... లేకపోతే నన్నయినా కొడతాడు అని చంద్రబాబు వివరించారు. అమరావతిని నాశనం చేశాడని, మూడు ముక్కల ఆట ఆడుతున్నాడని మండిపడ్డారు. 

"మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది. వైసీపీ పనైపోయింది.... ఇంక ఆ పార్టీని ఎవరైనా గెలిపిస్తారా? పిచ్చోడు కాకపోతే ఈ నాలుగేళ్లు మూడు ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేశాడు. సిగ్గనిపించడంలేదా? ఏంటీ ఖర్మ.... ఈ దరిద్రం మనకు ఎందుకు పట్టింది?" అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

ఈ తిక్క శంకరయ్య సెప్టెంబరులో విశాఖపట్నం వెళతానని చెబుతున్నాడని, కానీ శాశ్వతంగా ఇడుపులపాయ పంపించాలని వ్యాఖ్యానించారు. వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. 

ఇక, ప్రకాశం జిల్లాలో ప్రతిష్ఠాత్మక వెలుగొండ ప్రాజెక్టును తానే పూర్తిచేస్తానని, ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి సాగునీటి సమస్య పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.

More Telugu News