Cinematography amendment bill-2023: సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

  • పైరసీదారులపై గరిష్ఠంగా రూ.10 లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష వేసేలా బిల్లులో ప్రతిపాదన
  • సినిమాలకు సంబంధించి కొత్త ఉపవర్గీకణల రూపకల్పన
  • త్వరలో పార్లమెంటు ముందుకు రానున్న సవరణ బిల్లు
Cabinet approves amendment in the Cinematograph Act 1952 to curb film piracy

పైరసీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో సినిమాట్రోగ్రఫీ చట్టం-1952కు సవరణలు చేసే బిల్లును కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. పైరసీ బెడదకు నివారణ చర్యలతో పాటూ సినిమా వర్గీకరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టంలో పలు మార్పులను కూడా చేర్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించనున్నారు. 

సినిమా పైరసీ నిరోధానికి ఈ బిల్లులో భారీ జరిమానాలను ప్రతిపాదించారు. పైరసీకి పాల్పడ్డ వారిపై రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల జరిమానాతో పాటూ గరిష్ఠంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. అంతేకాకుండా సినిమాల వర్గీకరణకు సంబంధించి యూ/ఏ7 ,  యూ/ఏ13 , యూ/ఏ46 పేరిట మూడు అదనపు కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఓటీటీల్లో కంటెంట్ వర్గీకరణకు అనుగూణంగా సినిమాల్లో యూ సర్టిఫికేట్‌కు సంబంధించి ఈ మూడు ఉపవర్గీకరణలను చేర్చారు. 

2019లో తొలిసారిగా రాజ్యసభలో సినిమాటోగ్రఫీ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పట్లో పైరసీపైనే లక్ష్యంగా చట్ట సవరణలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఐటీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం విచారణ చేపట్టి ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికకు అనుగుణంగా కేంద్రం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023ను తీర్చిదిద్దింది. బిల్లుపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

More Telugu News