Hyderabad: కుషాయిగూడ టింబర్ డిపోలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

Three dead in fire accident in a timber depot in Hyderabad
  • పక్కనే ఉన్న భవనానికి వ్యాపించిన మంటలు
  • తప్పించుకునే మార్గం లేక మంటల్లో ఆహుతి
  • కనిపించకుండా పోయిన మరో చిన్నారి ఆచూకీ కోసం గాలింపు
  • ప్రమాద కారణంపై పోలీసుల ఆరా
హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో తల్లీబిడ్డలు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో టింబర్ డిపోలో అంటుకున్న మంటలు క్షణాల్లోనే పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు తప్పించుకునే మార్గం లేక మంటల్లో చిక్కుకుని మరణించారు.

దంపతుల మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే, కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు.
Hyderabad
Kushaiguda
Fire Accident

More Telugu News