Dhoni: ధోనీని కలిసిన కుష్బూ అత్తగారు.. ఫొటోలు ఇవిగో!

  • ధోనీని విపరీతంగా అభిమానించే కుష్బూ అత్తగారు
  • ఇద్దరినీ కలిపిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ
  • ధన్యవాదాలు తెలిపిన కుష్బూ
  • మా అత్తగారి ఆయుష్షు పెంచేశావంటూ ధోనీకి కృతజ్ఞతలు
Khushbu mother in law met Dhoni

మైదానంలోనూ, బయటా మిస్టర్ కూల్ అనిపించుకునే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించని వారెవరుంటారు? తన ఆటతీరుతో, మాటతీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకునే ధోనీ... భారత్ లో ఎందరికో ఆరాధ్యుడు. యువత అంటే సరేసరి... వయసు మళ్లిన వాళ్లు కూడా ధోనీ ఫ్యాన్స్ అంటే ఆశ్చర్యం కలగకమానదు. ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత కుష్బూ అత్తగారు కూడా ధోనీకి వీరాభిమాని. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా వెల్లడించారు. 

చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్సీ వహించే ధోనీ అంటే తమిళులకు వల్లమాలిన అభిమానం ఏర్పడింది. కుష్బూ భర్త సి.సుందర్ తల్లి కూడా ధోనీని విపరీతంగా అభిమానిస్తారట. ఆ అభిమానమే ఆమెను ధోనీ ఆతిథ్యం అందుకునేలా చేసింది. ధోనీని తన అత్తగారు కలిశారని కుష్బూ వెల్లడించారు. 

"హీరోలు తయారు కారు... వాళ్లు పుడతారంతే. ధోనీ ఈ విషయాన్ని నిరూపించాడు. ధోనీ సహృదయత, ఆతిథ్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ధోనీ మా అత్తగారిని కలిశాడు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ధోనీ అంటే పడిచచ్చిపోతుంది. ఆమెకు ధోనీ తప్ప మరెవ్వరూ నచ్చరు. మాహీ... నువ్వు ఆమెను కలవడం ద్వారా ఆమె ఆయుష్షును, సంతోషాన్ని మరింత పెంచేశావు. అందుకు నీకు ధన్యవాదాలు. ఈ భేటీని సాకారం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి రుణపడి ఉంటాను" అంటూ కుష్బూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తన అత్తగారు ధోనీని కలిసినప్పటి ఫొటోలు కూడా పంచుకున్నారు.

More Telugu News