Punjab Kings: పంజాబ్ కింగ్స్ దూకుడు... కోల్ కతా నైట్ రైడర్స్ ముందు భారీ టార్గెట్

  • ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్
  • తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్
Punjab Kings set KKR huge target

ఐపీఎల్ నేడు డబుల్ హెడర్ కాగా... తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్... పంజాబ్ కు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. భానుక రాజపక్స 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు చేయడం ఇన్నింగ్స్ లో హైలైట్ గా నిలిచింది. 

ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 23 పరుగులు చేయగా... కెప్టెన్ శిఖర్ ధావన్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 21, శామ్ కరన్ 17 బంతుల్లో 2 సిక్సులతో 26 (నాటౌట్) పరుగులు సాధించారు. 

ఆఖర్లో షారుఖ్ ఖాన్ (11 నాటౌట్) రెండు బౌండరీలు బాదాడు. సికందర్ రజా 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 16 పరుగులు చేశాడు. ఇలా పంజాబ్ ఇన్నింగ్స్ లో ప్రతి ఒక్కరూ భారీ షాట్లతో అలరించారు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ఉమేశ్ యాదవ్ 1, సునీల్ నరైన్ 1, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

More Telugu News