Revanth Reddy: ఎవరికెన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ కు ఎలా తెలుసు?: రేవంత్ రెడ్డి

  • కొనసాగుతున్న టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ రగడ
  • ఈడీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
  • కేటీఆర్ ఓ నీచుడు అని ఘాటు వ్యాఖ్యలు
  • కేటీఆర్ ఏం చెబుతున్నారో సిట్ అదే చేస్తోందని ఆరోపణలు
Revanth Reddy take a swipe at KTR in TSPSC question papers leak

టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు లీగల్ నోటీసులు పంపడం ద్వారా మంత్రి కేటీఆర్ హెచ్చరికలు చేయడం తెలిసిందే. తనకు క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు. దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. 

కేటీఆర్ ఒక నీచుడు.... నాకు నోటీసులు ఇచ్చేదేంది? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పరువు ఖరీదు రూ.100 కోట్లు. ఆ వంద కోట్లు వస్తే కేటీఆర్ ను ఎన్ని బూతులైనా తిట్టుకోవచ్చా? అంటూ రేవంత్ వ్యంగ్యం ప్రదర్శించారు.

ఎవరికెన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ కు ఎలా తెలుసని ప్రశ్నించారు. పేపర్ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా... పబ్లిక్ డొమైన్ లో లేని సమాచారం కేటీఆర్ కు తెలిసిందని నిలదీశారు. 

పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ ఏం చెబుతున్నారో సిట్ అదే చేస్తోందని రేవంత్ మండిపడ్డారు. దమ్ముంటే ఈ కేసు సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో విచారణ జరపాలంటూ ఈడీకి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News