Revanth Reddy: నా పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నా: రేవంత్ రెడ్డి

  • తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజి
  • ఓయూలో విద్యార్థులతో కలిసి దీక్ష జరపాలని భావించిన రేవంత్
  • హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • ప్రశ్నాపత్రాల లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్న రేవంత్
Revanth Reddy says he postponed his padayatra

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారం నేపథ్యంలో తాజా నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. 

పేపర్ లీకేజిపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6 వరకు తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల జీవితాలను ఈ ప్రభుత్వం చీకట్లోకి నెడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. 

2021లో అర్హత లేని వారిని టీఎస్ పీఎస్సీ సభ్యులుగా నియమించారని ఆరోపించారు. పేపర్ లీక్ కేసులో శంకరలక్ష్మి సాక్షి ఎలా అవుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఐటీ శాఖకు సంబంధం ఉందని అన్నారు. 

కాగా, టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజిని నిరసిస్తూ ఓయూ విద్యార్థులతో దీక్ష నిర్వహించాలని భావించిన రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అద్దంకి దయాకర్ తదితర కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు ఓయూకి వెళ్లకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News