రాహుల్ గాంధీ అనర్హతకు గురయినట్టే!: కపిల్ సిబాల్
- మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
- చట్టం ప్రకారం రాహుల్ ఆటోమేటిక్ గా అనర్హతకు గురయినట్టేనన్న కపిల్ సిబాల్
- తీర్పుపై స్టే వస్తేనే ఎంపీగా కొనసాగుతారని వివరణ
కోర్టు తీర్పుపై స్టే వస్తేనే లోక్ సభ సభ్యుడిగా రాహుల్ కొనసాగుతారని కపిల్ సిబాల్ చెప్పారు. చట్టం ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధి రెండేళ్ల జైలు శిక్షకు గురైతే ఆ సభ్యుడి స్థానం ఖాళీ అయినట్టేనని తెలిపారు. చట్టాన్ని అనుసరించి లోక్ సభ స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. 2013లో లిల్లీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన గుర్తు చేశారు. ఏదైనా కేసులో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కనీసం రెండేళ్ల జైలు శిక్షను విధించినట్టయితే తక్షణమే వారి అనర్హత అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు.