TTD: 2023-24 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్ ప్రతిపాదనలు ఇవిగో!

  • టీటీడీ మొత్తం బడ్జెట్ విలువ రూ.4,411 కోట్లు
  • బడ్జెట్ వివరాలు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి
  • గత నెలలోనే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి
  • ఎన్నికల కోడ్ ఉండడంతో అప్పుడు వెల్లడించలేకపోయామని వివరణ
TTD annual budget details

కరోసా సంక్షోభం సమయంలో తిరుమల శ్రీవారి ఆలయం మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్లు రావడం, దేశంలో వైరస్ మహమ్మారి వ్యాప్తి సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో తిరుమల క్షేత్రం మళ్లీ తెరుచుకుంది. గత కొన్నినెలలుగా తిరుమల క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 

ఈ నేపథ్యంలో, 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను టీటీడీ బడ్జెట్ రూపొందించింది. ఇందులో ప్రతిపాదలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గత నెలలోనే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించామని, ఆ సమావేశంలోనే బడ్జెట్ సంబంధ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ వివరాలు తెలపలేకపోయామని చెప్పారు. 

తిరుమల అన్నమయ్య భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి బడ్జెట్ వివరాలు తెలిపారు.

  • టీటీడీ మొత్తం బడ్జెట్ విలువ రూ.4,411.68 కోట్లు
  • తిరుమల లడ్డూల విక్రయం కోసం మరో 30 కౌంటర్లు... రూ.5.25 కోట్లు కేటాయింపు
  • తమిళనాడు ఉల్లందూరుపేటలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయం, పలు అభివృద్ధి పనుల కోసం రూ.4.70 కోట్లు మంజూరు
  • తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీలో మూడో అంతస్తు నిర్మాణం కోసం రూ.4.71 కోట్లు కేటాయింపు

ఇక కరోనా సంక్షోభానికి ముందు శ్రీవారికి ఏడాదికి రూ.1,200 కోట్ల ఆదాయం లభిస్తే, కరోనా తర్వాత ఏడాదికి రూ.1,500 కోట్ల ఆదాయం లభిస్తోందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అదే సమయంలో వివిధ బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగాయని తెలిపారు. 

ఇక, వీఐపీ బ్రేక్ దర్శన సమయాలు మార్చడంతో సామాన్యులకు ఎంతో ఉపయుక్తంగా ఉందని, ఈ విధానాన్ని కొనసాగిస్తామని అన్నారు. 

తిరుపతిలో శ్రీనివాస సేతు పనులు ఏప్రిల్ లోపు పూర్తి చేస్తామని, అలిపిరి నుంచి వకుళమాత ఆలయం వరకు కొత్త రోడ్డు మంజూరు చేస్తున్నామని వివరించారు.

More Telugu News