Japan PM: మోదీతో భేటీ అయిన జపాన్ ప్రధాని కిషిదా

  • ఈ ఉదయం ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని
  • ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని విస్తరించడంపై విస్తృతంగా చర్చలు జరిపిన మోదీ, కిషిదా
  • 27 గంటల పాటు కొనసాగనున్న జపాన్ ప్రధాని పర్యటన
Japan PM meets Modi

ప్రధాని  మోదీతో జపాన్ పీఎం ప్యుమియో కిషిదా భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఇరువురు విస్తృతంగా చర్చలు జరిపారు. కిషిదాతో భేటీ అనంతరం మీడియాతో మోదీ మాట్లాడుతూ... ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. భారత్ అధ్యక్షతన జరగనున్న జీ20 సదస్సు గురించి కిషిదాకు వివరించానని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నామని చెప్పారు. 

కిషిదా మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కు సంబంధించిన ప్రణాళికను ప్రస్తుత భారత్ పర్యటనలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఈ ప్రణాళిక భారత్ తో తమ ఆర్థిక సహకారం అభివృద్ధికి దోహదం చేస్తుందని, దీంతో పాటు జపాన్ కు ఆర్థిక అవకాశాలను కూడా సృష్టిస్తుందని తెలిపారు. మరోవైపు భారత్ లో జపాన్ ప్రధాని పర్యటన సుమారు 27 గంటల పాటు కొనసాగనుంది. ఓవైపు ఉక్రెయిన్ సంక్షోభం, మరోవైపు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇద్దరు ప్రధానుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

More Telugu News