KTR: మోదీజీ.. మీకు సూటి ప్రశ్న: కేటీఆర్

  • ఇంధన ధరల పెరుగుదలపై ప్రధానిని నిలదీసిన కేటీఆర్
  • క్రూడ్ ధరలు తగ్గినప్పుడు.. పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గవని ట్వీట్
  • తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు మంచి రచయితలుగా పనికొస్తారంటూ మరో సెటైరికల్ ట్వీట్
KTR Straight question to PM modi on skyrocketing Fuel Prices

పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలపై ప్రధాని మోదీజీకి సూటి ప్రశ్న. మే 2014లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ.71 ఉండేది. అదే 2023 మార్చి నాటికి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 65 డాలర్లు మాత్రమే ఉంటే.. లీటర్ పెట్రోల్ ధర రూ.110కి పెరిగింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే.. ఇంధన ధరలు పెంచారు. మరి క్రూడ్ ధరలు తగ్గితే ఇంధన ధరలు ఎందుకు తగ్గించలేదు?’’ అని ప్రశ్నించారు.

ఎల్ పీజీ గ్యాస్ ధరను భారీగా పెంచడంపైనా నిలదీశారు. ‘ఇంధన ధరలు తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కొందరు అంటున్నారు. ఎల్ పీజీ ఇప్పటికే జీఎస్టీ పరిధిలో ఉంది. కానీ 8 ఏళ్లలో రూ.400 నుంచి రూ.1,200కి పెరిగింది’’ అని చెప్పుకొచ్చారు. జీఎస్టీలో ఉన్న ఎల్ పీజీ సిలిండర్ ధరలు తగ్గించని ప్రభుత్వం.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలను మాత్రం తగ్గిస్తుందని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.

మరోవైపు తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు తమ ఊహలతో తప్పకుండా మంచి రచయితలుగా పనికొస్తారని మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. ‘‘రేవంత్‌ ఎన్నటికీ ఆధారాలు చూపించని జోక్స్‌ ఇవి...! సచివాలయం కింద దొరికిన నిజాం బంగారాన్ని కేటీఆర్‌ తీసుకున్నారు.. కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ కోసం కేటీఆర్ బావ రూ.10,000 కోట్లు పొందారు. కేటీఆర్ పీఏ సహచరులు గ్రూప్ 1లో అత్యధిక మార్కులు సాధించారు..’’ అని బీఆర్ఎస్ లీడర్ ఒకరు ట్వీట్ చేయగా.. కేటీఆర్ స్పందించారు. 

‘‘రేవంత్‌ రెడ్డికి పూర్తిగా మతిపోయింది. తెలంగాణలో ప్రతిపక్ష నాయకులు తమ ఊహాశక్తితో గొప్ప నవలా రచయితలు కాగలరని నేను భావిస్తున్నాను. వారికి శుభాకాంక్షలు’’అని బదులిచ్చారు.

More Telugu News