Chandrababu: మా ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేల దాడి దిగ్భ్రాంతి కలిగించింది: చంద్రబాబు

  • ఎమ్మెల్సీ ఫలితాలతో జగన్ కు పిచ్చెక్కిందన్న చంద్రబాబు
  • ఎమ్మెల్యే స్వామిపై దాడికి ముందే ప్రణాళిక రూపొందించుకున్నారని వెల్లడి
  • శాసనసభ కాదు కౌరవసభ అంటూ ఆగ్రహం
  • అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటిరోజు అని వ్యాఖ్యలు
  • రేపటి నుంచి బయట తిరగ్గలరా? అంటూ వార్నింగ్
Chandrababu reacts very sharply on Assembly incident

ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శాసనసభ కాదు... కౌరవ సభ అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో పిచ్చెక్కిన జగన్ ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి తెగబడ్డారంటూ మండిపడ్డారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో, ఈ దాడికి ముందే ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, తమ ఎమ్మెల్యే స్వామిపై దాడి ఘటనలో పాలుపంచుకున్న వైసీపీ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి రాక్షస చర్యలతో చరిత్రలో జగన్ ఒక మాయని మచ్చలా మిగిలిపోతారని పేర్కొన్నారు. 

"అసెంబ్లీలో ఎమ్మెల్యే స్వామికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. ఒక దళితుడిపై దాడి చేశారు. కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదు. అసెంబ్లీలో ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే, జరిగిన ఘటనపై కూర్చుని చర్చించుకుని సమస్య పరిష్కారానికి పాటుపడేవారు... జరిగిన పరిణామం పట్ల విచారం వ్యక్తం చేసి ఉండేవారు... అదీ ఆ సభ గౌరవం. అలాంటి సభా గౌరవాన్ని మంటగలిపిన సైకో జగన్ మోహన్ రెడ్డి. నా బాధంతా దాని గురించే. 

నేను శాశ్వతం కాదు... జగన్ రెడ్డి కూడా శాశ్వతం కాదు... మనం ఎవరం శాశ్వతం కాదు. అసెంబ్లీ శాశ్వతం అని, కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోతుంది. కానీ ఇవాళ జరిగిన ఘటన చరిత్రలో చీకటిరోజుగా ఎప్పటికీ ఉండిపోతుంది. అది నా బాధ, ఆవేదన. సభలో విజ్ఞత లేని పనికిమాలిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. 

మమ్మల్ని వ్యక్తిగత విరోధుల్లా చూస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరు 151 మంది ఉన్నారని మమ్మల్ని చంపేస్తారా? రేపటి నుంచి మీరు బయటికి రాగలరా? మీ పోలీసులు కూడా మిమ్మల్ని కాపాడలేరు" అంటూ చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

More Telugu News