Aadhaar: మరణించిన వెంటనే పనిచేయకుండా పోయే ఆధార్

Aadhaar to soon die with holders death
  • నూతన యంత్రాంగంపై పనిచేస్తున్న యూఐడీఏఐ
  • రిజిస్ట్రార్ జనరల్ తో కలసి కొత్త విధానం రూపకల్పన
  • కుటుంబ సభ్యుల సమ్మతితో డెత్ సర్టిఫికెట్ జారీ అనంతరం ఆధార్ రద్దు
ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఆధార్ పనిచేయకుండా పోయే కొత్త విధానం త్వరలో రానుంది. ఇందుకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ), రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో చర్చలు నిర్వహిస్తోంది. ఒక వ్యక్తికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసే సమయంలోనే ఆధార్ ను డీయాక్టివేట్ చేసే యంత్రాంగం ఏర్పాటుపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

అయితే, ఏకపక్షంగా ఇలా ఆధార్ ను రద్దు చేయరు. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తర్వాత, సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు విషయం చెబుతారు. వారు ఓకే చెబితే ఆధార్ ను రద్దు చేస్తారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా ఆధార్ రద్దు చేస్తే, వారు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. సాధారణంగా మరణించిన వ్యక్తి పేరిట ఏవైనా ఆస్తులు, పెట్టుబడులు ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ధ్రువీకరణ పత్రాలు కూడా అడుగుతుంటారు. 

రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో నూతన విధానాన్ని తీసుకురావాలని యూఐడీఏఐ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయి. మరణ ధ్రువీకరణ పత్రం జారీ సమయంలో అతడు/ఆమె ఆధార్ నంబర్ ను కుటుంబ సభ్యులు తెలియజేయాలి. అప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంలో ఆధార్ ను కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aadhaar
deactivation
after death
death certificate
UIDAI

More Telugu News