Kailasa: కైలాస దేశం ఎక్కడా లేదు... అసలు విషయం ఇదే!

  • నిత్యానందపై అత్యాచార ఆరోపణలు
  • విదేశాలకు పారిపోయిన నిత్యానంద
  • కైలాస దేశం స్థాపించానంటూ ప్రకటన
  • ఐక్యరాజ్యసమితిలోనూ కైలాస ప్రతినిధుల సందడి
  • అమెరికా నగరాలతో ఒప్పందాలు!
The fact about Kailasa of Nithyananda

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన స్వామి నిత్యానంద... తాను కైలాస దేశం స్థాపించానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే కైలాస దేశ ప్రతినిధులమంటూ కొందరు అతివలు ఐక్యరాజ్యసమితిలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

అంతేకాదు, అమెరికాలోని పలు నగరాలతోనూ ఒప్పందాలు కుదుర్చుకున్నామని ప్రకటన చేయడంతో, ఇంతకీ ఆ కైలాస దేశం ఎక్కడ ఉందన్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనికి కైలాస దేశ ప్రతినిధులే వివరణ ఇచ్చారు. 

కైలాస అనే దేశం భౌగోళికంగా ఎక్కడా లేదని స్పష్టం చేశారు. కైలాస... సరిహద్దులు లేని సేవా ఆధారిత దేశం అని వెల్లడించారు. 'సావెరిన్ ఆర్డర్ ఆఫ్ మాల్టా' దేశం తరహాలోనే కైలాస కూడా పలు స్వచ్ఛంద సంస్థలు, ఆలయాలు, మఠాల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుందని కైలాస ప్రతినిధులు వివరించారు. 

ప్రాచీన హిందూ నాగరికత పునరుద్ధరణే కైలాస దేశ ఏర్పాటు వెనుక ముఖ్య ఉద్దేశమని, ప్రస్తుతానికి ఐక్యరాజ్యసమితి అనుబంధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని వారు చెప్పారు. 

ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ దీవి తమ సొంతమని నిత్యానంద గతంలో చెప్పగా, ఈ విషయాన్ని మీడియా కైలాస ప్రతినిధుల వద్ద ప్రస్తావించింది. అందుకు వారు బదులిస్తూ... నిత్యానంద ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదని తేల్చేశారు.

More Telugu News