Tarun Chugh: బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు: తరుణ్ చుగ్

  • టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ పై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న తరుణ్ చుగ్
  • కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్న
  • కేసీఆర్ కుటుంబం మూల్యం చెల్లించుకునే రోజు దగ్గర పడిందని వ్యాఖ్య
Tarun Chugh fires on KCR

తెలంగాణలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని కూడా ఖండిస్తున్నానని అన్నారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. లాఠీఛార్జీలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. 

బండి సంజయ్ ని అరెస్ట్ చేసో, ప్రజలపై దౌర్జన్యానికి పాల్పడో పేపర్ లీకేజ్ స్కామ్ నుంచి బయటపడొచ్చని కేసీఆర్ భావిస్తే అది ఆయన అవివేకమే అవుతుందని అన్నారు. ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ఉద్యోగాల కోసం చూస్తున్న వేలాది మంది భవిష్యత్తు నాశనమయిందని చెప్పారు. కేసీఆర్ మోసాన్ని ప్రజల ముందు బీజేపీ బయటపెడుతుందని అన్నారు. కేసీఆర్ కుటుంబం భారీ మూల్యం చెల్లించుకునే రోజు ఎంతో దూరం లేదని చెప్పారు.

More Telugu News