Enforcement Directorate: ఈడీ ఆఫీస్ కు ర్యాలీ చేపట్టిన విపక్షాలు.. పోలీసులు అడ్డుకోవడంతో రద్దు!

  • పార్లమెంటు నుంచి ర్యాలీగా బయల్దేరిన 18 పార్టీలు
  • బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు
  • ర్యాలీని రద్దు చేసుకుని పార్లమెంటుకు వెళ్లిపోయిన నేతలు
on adani issue opposition march to enforcement directorates office

ఈడీ ఆఫీస్ కు ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ర్యాలీ అర్థాంతరంగా ముగిసింది. అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి విపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.30 సమయంలో పార్లమెంటు నుంచి ఈడీ ఆఫీసుకు 18 పార్టీల నేతలు యాత్ర చేపట్టారు. ఈ మేరకు ఈడీ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని భావించారు.

అయితే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 10 వ్యాన్లను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఈడీ ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పార్లమెంటు పరిసరాల్లో పోలీసులు.. ప్రతిపక్ష నేతలను అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో ప్రతిపక్ష నేతలు ర్యాలీని రద్దు చేసుకున్నారు. తిరిగి పార్లమెంటుకు వెళ్లిపోయారు. తాము ఈడీ అపాయింట్ మెంట్ కోరామని, సంయుక్త ఫిర్యాదు లేఖను ఈడీకి అందజేస్తామని ప్రతిపక్ష నేతలు వెల్లడించారు. 

‘‘మమ్మల్ని వాళ్లు (పోలీసులు) అడ్డుకున్నారు. మేం 200 మంది ఉన్నాం.. వాళ్లు 2 వేల మందికి పైనే ఉన్నారు. అధికార పార్టీ నేతలు మా గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారు. మళ్లీ వాళ్లే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఏదైనా సెమినార్ లో లేదా డిబేట్ లో ఇవే విషయాలను మాట్లాడితే దేశ వ్యతిరేకులనే ముద్ర వేస్తారని ఖర్గే విమర్శించారు. లండన్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీ స్పందనను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు.

More Telugu News