Bandi Sanjay: టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నీ లీక్: బండి సంజయ్

  • టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్
  • నిందితుల అరెస్ట్
  • గ్రూప్-1 క్వశ్చన్ పేపర్ కూడా లీకైందన్న బండి సంజయ్
  • న్యాయ విచారణ జరపాల్సిందేనని డిమాండ్
Bandi Sanjay reacts on question paper leakages from TSPSC

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ)లో ప్రశ్నాపత్రాల లీకేజి తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్షలన్నీ లీక్ అని వ్యాఖ్యానించారు. గ్రూప్-1 ప్రశ్నాపత్రం కూడా లీకైందని అన్నారు. 

తాజా ప్రశ్నాపత్రాల లీకేజి ఘటనలో నిందితుడు ప్రవీణ్ గతంలో టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ఓ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాగా, అతడి ఓఎంఆర్ షీటును కూడా బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. 

ప్రశ్నాపత్రాల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ మండిపడ్డారు. రాబోయే రెండు మూడు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి కేసీఆర్ టీమ్ కు లీక్ అయ్యాయని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వలేక దారుణాలకు ఒడిగడతారా? అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. 

టీఎస్ పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని స్పష్టం చేశారు. క్వశ్చన్ పేపర్ల లీకేజిపై న్యాయవిచారణ జరపాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేకపోతే ప్రగతిభవన్, టీఎస్ పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

More Telugu News