Uttar Pradesh: తన భార్య చెప్పిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నితిన్ గడ్కరీ

  • యూపీలో పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన
  • శ్రీకృష్ణుడే యోగి రూపంలో వచ్చాడని ప్రశంసలు
  • సజ్జనులను రక్షిస్తూ దుర్మార్గులను శిక్షిస్తున్నారన్న కేంద్రమంత్రి
Nitin Gadkari Likens Yogi Adityanath To Lord Krishna

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సాక్షాత్తు శ్రీకృష్ణుడట! చెడును అంతం చేసేందుకు ఈ భూమిపైకి వచ్చారట. ఈ మాటలన్నది మరెవరో కాదు.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల విలువైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు గోరఖ్‌పూర్ వచ్చిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో పేరుకుపోయిన ప్రమాదకరమైన, చెడు ధోరణుల నుంచి ప్రజలను రక్షించేందుకు యోగి కఠిన చర్యలు చేపట్టారని, దేశ ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.

ఈ సందర్భంగా తన భార్యతో జరిగిన ఓ ఆసక్తికర సంభాషణను ఆయన పంచుకున్నారు. యూపీలో ఏం జరుగుతోందని తన భార్య అడిగితే.. నేరాలను అదుపు చేసేందుకు గత ఆరేళ్లలో ఇక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆమెకు వివరించానని అన్నారు. అప్పుడు.. ఆమె మాట్లాడుతూ.. చెడును అంతం చేసేందుకు తాను మళ్లీ వస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ఆమె తనకు గుర్తు చేసిందని గడ్కరీ చెప్పారు. శ్రీకృష్ణుడిలానే యోగి కూడా మంచివారిని రక్షిస్తూ, దుర్మార్గులను శిక్షిస్తున్నారని కొనియాడారు.

More Telugu News