RCB: ఆర్సీబీ అమ్మాయిలు ఇవాళైనా గెలిచేనా...?

  • డబ్ల్యూపీఎల్ లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసిన బెంగళూరు
  • రాణించిన ఎలిస్ పెర్రీ, రిచా ఘోష్
  • శిఖా పాండేకు 3 వికెట్లు
RCB takes on Delhi Capitals in WPL

భారత్ లో అట్టహాసంగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టేదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రమే. ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ అన్నింటా ఓడిపోయింది. 

అలాగని ఆ జట్టులో స్టార్లు ఎవరూ లేరా అంటే అదీ కాదు. స్మృతి మంధన, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీదర్ నైట్, మేగాన్ షట్, రేణుకా సింగ్, రిచా ఘోష్ వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. కానీ, వరుస ఓటములతో బెంగళూరు జట్టు డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. 

ఇవాళ ఆర్సీబీ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేశారు. 

ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. వికెట్ కీపర్ రిచా ఘోష్ ధాటిగా ఆడి 16 బంతుల్లోనే 37 పరుగులు చేసింది. రిచా స్కోరులో 3 ఫోర్లు, 3 సిక్సులున్నాయి. 

కెప్టెన్ స్మృతి మంధన (8) మరోసారి విఫలం కాగా, ఓపెనర్ సోఫీ డివైన్ 21 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే 3 వికెట్లు తీయగా, తారా నోరిస్ 1 వికెట్ పడగొట్టింది.

అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలోనే కీలక వికెట్ కోల్పోయింది. విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ తొలి బంతికే డకౌట్ అయింది.

More Telugu News