జర్మనీలో కాల్పుల కలకలం..ఏడుగురి మృతి

7 Killed In German Church Shooting Police Issue Extreme Danger Warning
  • హాంబర్గ్ నగరంలో గురువారం వెలుగు చూసిన ఘటన
  • జెహోవాస్ విట్నెస్ కేంద్రంలో కాల్పులు
  • పలువురికి తీవ్ర గాయాలు
  • జర్మనీలో పెరుగుతున్న హింసాత్మక ఘటనలు
జర్మనీలో కాల్పుల కలకలం రేగింది. హాంబర్గ్ నగరంలోని జెహోవాస్ విట్నెస్ సెంటర్ అనే చర్చ్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా ఏడుగురు మృతి చెందారు. గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్యపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కాల్పుల్లో కనీసం ఏడుగురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఇక స్థానిక పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు. తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నందున స్థానికులు తమ ఇళ్లల్లోంచి బయటకు రావద్దని సూచించారు. ఇక కాల్పులు జరిగిన సమయంలో జెహోవా విట్నెస్‌ వర్గానికి చెందిన సభ్యులు బైబిల్ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో నిందితుడు కూడా మరణించినట్టు సమాచారం. 

ఇటీవల కాలంలో జర్మనీలో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అటు జీహాదీలు.. ఇటు ఫార్ రైట్ అతివాదుల దాడుల్లో పలువురు అమాయకులు అసువులు బాసారు. ఇరాక్, సిరియాల్లో ఐసిస్ తీవ్రవాద సంస్థ వ్యతిరేక కూటమిలో భాగమైన జర్మనీ..జీహాదీలకు టార్గెట్‌గా మారింది. మరోవైపు.. ఫార్ రైట్ వర్గాలకు చెందిన అతివాదులు కూడా దాడులకు తెగబడ్డారు. 2019లో ఓ యూదు ప్రార్థనా కేంద్రంలో నయానాజీ నిందితుడు ఒకడు ఇద్దరిని కాల్చి చంపేశాడు.
Go Back to Shorts
Germany

More Telugu News