BJP: విదేశీ గడ్డపై నుంచి భారత్ ను అవమానించేలా మాట్లాడతారా?: రాహుల్ పై బీజేపీ ఫైర్

  • ఇటీవల కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్ ప్రసంగం
  • భారత్ లో మైనారిటీలను ద్వితీయశ్రేణి పౌరుల్లా చూస్తున్నారని వ్యాఖ్యలు
  • పాకిస్థాన్ కూడా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్న బీజేపీ
  • డబ్బులకు అమ్ముడుపోయే ఏజెంట్ లా మాట్లాడుతున్నారని విమర్శలు
BJP fires on Rahul Gandhi for his speech in Cambridge University

బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై బీజేపీ మండిపడుతోంది. భారత్ లో మైనారిటీలు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారిని ద్వితీయశ్రేణి పౌరుల్లా చూస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. 

ఓవైపు భారత్ ను ప్రపంచమంతా కీర్తిస్తుంటే... రాహుల్ మాత్రం విదేశీగడ్డ పైనుంచి భారత్ ను అవమానించేలా మాట్లాడారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఎప్పుడూ ఇంత సాహసం చేయలేదని అన్నారు.

ఓ ప్రముఖ యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు. డబ్బులకు అమ్ముడుపోయే ఏజెంట్ లా రాహుల్ వ్యవహరించారని సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. 

చైనా నుంచి తమ పెట్టుబడులను భారత్ కు తరలించాలని పారిశ్రామికవేత్తలు భావిస్తుంటే, వారిని అడ్డుకునేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నట్టుందని విమర్శించారు. భారత్ ఘనతలను మంటగలిపేందుకు రాహుల్ గాంధీ కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు.

More Telugu News