Batchula Arjunudu: బచ్చుల అర్జునుడు మృతిపై చంద్రబాబు, లోకేశ్ స్పందన

  • టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
  • అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని పేర్కొన్న చంద్రబాబు
  • పార్టీకి తీరని లోటు అని విచారం
  • టీడీపీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్న లోకేశ్
Chandrababu and Lokesh condolences to the demise of Batchula Arjunudu

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చు అర్జునుడు మరణం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని తెలిపారు. అర్జునుడు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 

అటు, యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు మృతి చెందిన సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు.  

నిజాయతీకి మారుపేరు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని లోకేశ్ కొనియాడారు. ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.

More Telugu News