Germany: భారత ఐటీ ఉద్యోగులకు జర్మనీ ఛాన్సలర్ బంపర్ ఆఫర్

  • భారత ఐటీ నిపుణులు జర్మనీలో పనిచేసేందుకు ముందుకు రావాలన్న ఓలాఫ్ షోల్జ్
  • జర్మనీలో నిపుణుల కొరత ఉందని వెల్లడి
  • ఈ కొరతను తీర్చేందుకు వలసల విధానాన్ని సరళతరం చేసినట్టు ప్రకటన
Olaf Scholz Asks More Indian Techies To Consider Working In Germany

భారత ఐటీ ఉద్యోగులు జర్మనీలో జాబ్స్ చేసేందుకు ముందుకు రావాలని ఆ దేశ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాజాగా పేర్కొన్నారు. ఈ విషయమై భారత ఐటీ నిపుణులు ఆలోచించాలని చెప్పారు. రెండు రోజుల భారత పర్యటన ముగింపు సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ ఈ మేరకు పిలుపునిచ్చారు. 

జర్మనీలో కార్మికుల కొరతను తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని షోల్జ్ పేర్కొన్నారు. వలసలకు అడ్డంకులు తొలగించేందుకు పాయింట్స్ ఆధారిత వ్యవస్థను రూపొందించామని చెప్పారు. తద్వారా.. స్థిరమైన జాబ్ ఆఫర్ లేని నిపుణులు కూడా జర్మనీలోకి వచ్చేందుకు అవకాశం కుదిరిందన్నారు. ‘‘జర్మనీలో పనిచేసేందుకు ఈ అవకాశాన్ని భారతీయులు వినియోగించుకుంటారని ఆశిస్తున్నా. ఐటీతో పాటూ అన్ని రంగాల్లో జర్మనీకి నిపుణుల అవసరం ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఎంతమంది విదేశీయులను జర్మనీలోకి అనుమతిస్తారనేది మాత్రం ఆయన చెప్పలేదు. 

జర్మనీ-భారత్ వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా చర్చించారు. భారత్, ఐరోపా సమాఖ్య మధ్య వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం కుదిరేందుకు తాను వ్యక్తిగత స్థాయిలోనూ కృషి చేస్తానని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న జీ20 దేశాల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News