40 ఏళ్లు దాటితే..డైట్ మారాల్సిందే..!
- హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.. కండరాల నష్టం మొదలవుతుంది
- వేళకు, పోషకాహారం తీసుకోవాలి
- జీవనశైలి, ఆహార పరమైన మార్పులతో వ్యాధులకు దూరంగా ఉండొచ్చు
40 ఏళ్లు దాటిన తర్వాత కండరాల నష్టం (కోల్పోవడం) మొదలవుతుంది. కండరాల్లో కణాల పనితీరు మందగిస్తుంది. బరువు కూడా పెరుగుతారు. టెస్టోస్టెరాన్ హార్మోన్ విడుదల స్థాయి తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు, మధుమేహం, బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు కనిపిస్తాయి. కనుక 40 దాటితో మరింత శ్రద్ధ తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే ఉప్పు పరిమాణాన్ని తగ్గించుకోవాలి. అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తీపి పానీయాలను తీసుకోవద్దు. కండరాలను కోల్పోకుండా ఉండేందుకు, జీవక్రియలు బాగా పనిచేసేందుకు, శక్తి పెరిగేందుకు ప్రొటీన్, మల్టీ విటమిన్ లు అవసరమవుతాయి. దీనివల్ల కండరాల మరమ్మతులు జరుగుతాయి. కొల్లాజెన్ ఆధారిత సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
పరిశుభ్రమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తగినంత నిద్ర పోవాలి. రోజులో 3 లీటర్ల నీటిని తాగాలి. 30 నిమిషాల పాటు శారీరక వ్యాయామాలు చేయాలి. దీనివల్ల ఒత్తిడి పోయి, శరీర జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి. ట్యాక్సిన్లను బయటకు పంపించొచ్చు. పండ్లు, కూరగాయల పరిమాణాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పీచు ఉండాలి. ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లకు దూరం జరగాలి.