Robotic Elephant: త్రిసూర్ ఆలయంలో రోబో ఏనుగు... నిజం ఏనుగులాగే దీవిస్తుంది!

  • శ్రీకృష్ణ ఆలయంలో నిజం ఏనుగును తలపిస్తున్న రోబోటిక్ ఏనుగు
  • ఆలయానికి రోబో ఏనుగును బహూకరించిన పెటా
  • 'ఇరింజదపల్లి రామన్' గా నామకరణం
  • నిజం ఏనుగులాగే తొండం, చెవులు కదిల్చే రోబో ఏనుగు
Robotic Elephant in Trissur

సాధారణంగా హిందూ ప్రధాన దేవాలయాల్లో ఏనుగులు కనిపిస్తుంటాయి. భక్తులకు తొండంతో ఆశీర్వాదం అందించడం, స్వామివారి ఉత్సవాల్లో పాల్గొనడం ఆ ఏనుగుల విధి. అయితే త్రిసూర్ లోని శ్రీకృష్ణ ఆలయంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. ఇది చూడ్డానికి అచ్చం నిజం ఏనుగులానే ఉంటుంది. 

కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ 'పెటా'కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు. 

ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారని తెలిపారు. 

ఆలయ అధికారులు దీనిపై స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఈ రోబో ఏనుగుకు 'ఇరింజదపల్లి రామన్' అని నామకరణం చేశారు.

More Telugu News