Twitter: యూజర్లకు మరో ఝలక్ ఇచ్చిన ట్విట్టర్

  • యూజర్లపై మరోమారు వడ్డింపులకు సిద్ధం 
  • టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌కు డబ్బు చెల్లించాలన్న ట్విట్టర్
  • ఎస్ఎమ్ఎస్ బాట్లతో సంస్థకు 60 బిలియన్ డాలర్ల నష్టం అని వెల్లడి
Twitter To Charge Users To Secure Accounts Via Two Factor Authentication

ట్విట్టర్‌ మరోమారు వడ్డింపులకు దిగింది. ఎస్‌ఎమ్ఎస్‌ ఆధారిత టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(2ఎఫ్ఏ) భద్రతా సదుపాయాన్ని ఇకపై ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకే ఇస్తామంటూ శుక్రవారం ప్రకటించింది. త్వరలో ఈ విధానాన్ని ప్రారంభిస్తామని పేర్కొంది. యూజర్ల అకౌంట్లకు రెండంచెల సైబర్ భద్రత కల్పించేందుకు ట్విట్టర్.. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అకౌంట్లోకి లాగిన్ కావాలంటే.. ప్రధాన పాస్‌వర్డ్‌‌తో పాటూ ఎస్‌ఎమ్ఎస్‌, ఆథెంటికేషన్ యాప్ లేదా సెక్యురిటీ పాస్‌వార్డ్ అవసరమయ్యేలా ఈ భద్రతా వ్యవస్థను రూపొందించింది. ఇప్పటివరకూ ఈ ఫీచర్లను ఉచితంగానే అందించింది. కానీ.. ఎస్‌ఎమ్ఎస్ ఆథెంటికేషన్‌కు ఇకపై డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. 

ఎస్ఎమ్ఎస్ ఆధారిత ఆథెంటికేషన్‌ను బాట్ అకౌంట్లు దుర్వినియోగపరుస్తున్నాయని ట్విట్టర్ తాజాగా తన బ్లాగ్‌లో ఆరోపించింది. బాట్లతో 2 ఎఫ్ఏ పాస్‌వర్డులు వెల్లువెత్తుతున్నాయని, ఫలితంగా సంస్థకు ఏటా 60 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతోందని చెప్పింది. ఇప్పటికే ట్విట్టర్.. పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇది తీసుకున్న వారికి బ్లూ టిక్ మార్క్ కేటాయించడంతో పాటూ ట్విట్‌ చేశాక ఎడిట్ చేసుకునే సౌలభ్యం, ట్వీట్‌లో పదాల పరిమితి పెంపు తదితర ఫీచర్లను అందిస్తోంది. గతంలో వివిధ రంగాల ప్రముఖులకు మాత్రమే ఇచ్చే టిక్ మార్క్ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారందరికీ అందుబాటులోకి వచ్చింది.

More Telugu News