Gas: ఇటీవల అమెరికాలో గూడ్సు రైలు ప్రమాదం... గాల్లో కలిసిన అత్యంత విషపూరిత వాయువు!

  • ఒహైయో రాష్ట్రంలో పట్టాలు తప్పిన గూడ్సు
  • పట్టాలు తప్పిన 50 బోగీలు
  • కొన్ని బోగీల్లో విషపూరిత వినైల్ క్లోరైడ్ గ్యాస్
  • క్యాన్సర్ కలిగించే వాయువు
Goods train derailed in US as scares loom after possible poisonous gas leak

అమెరికాలో ఇటీవల ఓ రైలు ప్రమాదం జరిగింది. ఒహైయో రాష్ట్రంలో ఈస్ట్ పాలస్టైన్ అనే గ్రామం వద్ద ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. 50 బోగీలు పట్టాలు తప్పడమే కాదు, అగ్నికి ఆహుతి అయ్యాయి.

ఇప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏమిటంటే... ఆ గూడ్సు రైలులోని కొన్ని బోగీల్లో వినైల్ క్లోరైడ్ అనే అత్యంత విషపూరిత వాయువును తరలిస్తున్నారు. వినైల్ క్లోరైడ్ గ్యాస్ కు క్యాన్సర్ కలిగించే శక్తి ఉంది. ఈ బోగీలు మంటల్లో చిక్కుకోవడం వల్ల వినైల్ క్లోరైడ్ వాయువు వాతావరణంలోకి కలిసి ఉంటుందని భావిస్తున్నారు. 

ప్రమాదం జరిగిన వెంటనే పరిసర ప్రాంతాల్లోని వేలాది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి 5 రోజుల పాటు ఆశ్రయం కల్పించారు. ఈ రైలు ప్రమాదం ఫిబ్రవరి 4న జరగ్గా, అప్పటి నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఒక మైలు దూరం పరిధిలో జరిగే మార్పులను అమెరికా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. 

తొలుత ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలను పరీక్షించారు. ఎటువంటి విషపూరిత పదార్థాల ఆనవాళ్లు లేవని ఫలితాల్లో వెల్లడి కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈస్ట్ పాలస్టైన్ పరిసరాల్లోని నదులు, కాలువల్లోని నీటిని కూడా పరీక్షించనున్నారు. 

కాగా, పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బాటిల్ వాటర్ నే వినియోగించాలని స్థానిక ప్రభుత్వ యత్రాంగం ప్రజలకు సూచించింది.

More Telugu News