Tamil Nadu: సముద్రంలోకి 12 కిలోల బంగారాన్ని విసిరేసిన నిందితులు.. స్కూబా డైవర్లను రంగంలోకి దింపిన పోలీసులు!

  • తమిళనాడులోని రామేశ్వరంలో ఘటన
  • గస్తీ పోలీసులను చూసి సముద్రంలోకి బంగారాన్ని విసిరేసిన దుండగులు
  • సముద్రం అడుగు నుంచి బంగారం స్వాధీనం
12 kg smuggled gold bars worth Rs 8 crore recovered from seabed

సముద్రం ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నిందితులు పోలీసులను చూసి ఆ బంగారాన్ని సముద్రంలోకి విసిరేశారు. అనుమానించిన పోలీసులు స్కూబా డైవర్లను రంగంలోకి దింపి గాలించడంతో సముద్రం అడుగున బంగారం లభ్యమైంది. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వలైగుడా ప్రాంతంలో గస్తీలో ఉన్న పోలీసులకు సముద్రంలో ఓ పడవ అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు అటువైపుగా వెళ్లడంతో అందులోని ముగ్గురు స్మగ్లర్లు దొరికిపోతామన్న భయంతో తమ వద్ద ఉన్న 12 కిలోల బంగారు బిస్కెట్లను సముద్రంలో పడేశారు. 

పోలీసులు వారిని ప్రశ్నించి పడవను సోదా చేస్తే ఏమీ లభ్యం కాలేదు. అయితే, వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో స్కూబా డైవర్లను రప్పించి సముద్రం అడుగున వెతికించారు. ఈ క్రమంలో మన్నార్ వలైగుడా ప్రాంతంలో బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల విలువ రూ. 8 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

More Telugu News