సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్
- గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం ఎక్కిన వైనం
- సాయంత్రం 5.03 గంటలకు టేకాఫ్
- 5.26 గంటలకే తిరిగొచ్చిన విమానం
ఈ స్పెషల్ ఫ్లయిట్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సాయంత్రం 5.03 గంటలకు టేకాఫ్ తీసుకుంది. అయితే, కొన్ని నిమిషాలకే ఈ విమానం తిరిగొచ్చింది. సాయంత్రం 5.26 గంటలకు అత్యవసరంగా కిందికి దిగింది. దాంతో ప్రయాణాన్ని విరమించుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి పయనమయ్యారు. కాగా, సీఎం ప్రయాణిస్తున్న విమానం సాంకేతిక సమస్యల వల్లే అత్యవసరంగా తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. సమస్యలు చక్కదిద్దేందుకు విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం జగన్ రేపు ఢిల్లీలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఈ సమావేశానికి పలువురు దౌత్యవేత్తలు హాజరవుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ తో పాటు ఉన్నతాధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొంటున్నారు.