Cricket: సరికొత్త పాత్రలోకి దిగ్గజ క్రికెటర్​ మిథాలీ రాజ్

  • గుజరాత్ జెయింట్స్ మెంటార్ గా మిథాలీ
  • మహిళల ఐపీఎల్ లో జట్టును మార్గనిర్దేశం చేయనున్న దిగ్గజ క్రికెటర్
  • వచ్చే నెలలో మొదలవనున్న మహిళల ఐపీఎల్
Mithali ropes as Mentor for Gujarath giants

దిగ్గజ క్రికెటర్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సరికొత్త పాత్రలో కనిపించనుంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు ప్రకటించిన మిథాలీ.. ఇప్పుడు యువ క్రికెటర్లను మార్గనిర్దేశం చేయనుంది. వచ్చే నెలలో మొదలయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆమె మెంటార్, అడ్వైజర్ గా వ్యవహరించనుంది. ఈమేరకు ఫ్రాంచైజీతో ఆమె ఒప్పందం చేసుకుంది. గుజరాత్ జట్టులో మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు తన విశేష అనుభవంతో మిథాలీ సహాయ సహకారాలు అందించనుంది. కిందిస్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధి, ప్రమోషన్ లో కీలక పాత్ర పోషించనుందని గుజరాత్ ఫ్రాంచైజీ తెలిపింది.  

ఇటీవల జరిగిన మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలంలో గుజరాత్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ రూ. 1200 పైచిలుకు కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, మహిళల ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు, క్రికెట్ ను జీవనోపాధిగా మార్చుకునేందుకు ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో ఆట మరింత అభివృద్ధి సాధిస్తుందని వ్యాఖ్యానించింది.

More Telugu News