Vande Bharat: వందే భారత్ లో ఇకపై సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ

Railway Minister Cleaning Video After Viral Vande Bharat Garbage Pic
  • విమానాలలో పాటించే పద్ధతిని ఇకపై వందే భారత్ లో అమలు
  • బోగీ మొత్తం చెత్త చెత్తగా మారిన ఫోటోలపై కేంద్ర మంత్రి స్పందన
  • క్లీనింగ్ సిస్టంను మార్చేస్తున్నట్లు ప్రకటించిన అశ్విని వైష్ణవ్
  • సహకరించాలంటూ ప్రయాణికులను కోరిన మంత్రి
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. రైలు బోగీ మొత్తం చెత్తచెత్తగా మారిన ఫొటోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర మంత్రి స్పందించారు. వందే భారత్ రైలును పరిశుభ్రంగా ఉంచేందుకు చెత్త తొలగించే పద్ధతిని మార్చేశామని, ఈ కొత్త పద్ధతికి ప్రజల సహకారం కావాలని కోరారు. 

మెయింటనెన్స్ సిబ్బంది చెత్త బుట్టతో ప్రయాణికుల సీటు వద్దకే వచ్చి వాటర్ బాటిల్స్, టీ కప్పులు, ఆహార పదార్థాల కవర్లు.. తదితరాలను తీసుకెళతారని మంత్రి వివరించారు. ప్రస్తుతం విమానాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారని, ఇకపై వందే భారత్ లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తామని మంత్రి చెప్పారు.

ఆహార పదార్థాలు తినేశాక మిగిలిన వాటిని బోగీలోనే పడేయకుండా పక్కన పెట్టి, మెయింటనెన్స్ సిబ్బంది వచ్చాక ఆ చెత్త బుట్టలో పడేయాలని అశ్విని వైష్ణవ్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కొత్త పద్ధతి అమలు చేస్తే ఎలా ఉండబోతోందో చెబుతూ కేంద్ర మంత్రి ఓ వీడియోను ట్వీట్ చేశారు.
Vande Bharat
train
cleaning
railway minister
method
garbage
passengers

More Telugu News