Dawood: దావూద్ కరాచీలోనే ఉన్నాడు.. అడ్రస్ మార్చాడంతే!: ఎన్ఐఏ అధికారుల చార్జ్ షీట్

  • పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడన్న గ్యాంగ్ స్టర్ మేనల్లుడు
  • డిఫెన్స్ కాలనీలోని ఘాజీ బాబా దర్గా ఏరియాలో దావూద్ నివాసం
  • టెర్రర్ ఫండింగ్ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఎన్ఐఏ వివరణ
Dawood Ibrahim Has Remarried and he is in karachi tells Nephew

అండర్ వరల్డ్ డాన్, పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీలోనే ఉన్నాడని మరోమారు స్పష్టమైంది. దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలిషాహ్ పార్కర్ ఈ వివరాలను వెల్లడించినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పేర్కొంది. దావూద్ సోదరి హసీనా పార్కర్ కొడుకే ఈ అలీషాహ్ పార్కర్. అంతేకాదు, పాకిస్థానీ పఠాన్ మహిళను దావూద్ రెండో పెళ్లి చేసుకున్నట్లు పార్కర్ చెప్పాడు. ఈ పెళ్లి కోసం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చినట్లు దావూద్ చెబుతున్న మాటలు నిజంకాదని వివరించాడు. 

దావూద్ కరాచీలోనే ఉన్నాడని, కాకపోతే నివాసాన్ని వేరే ఇంటికి మార్చాడని పార్కర్ పేర్కొన్నాడు. ఈమేరకు టెర్రర్ ఫండింగ్ కేసులో విచారణ జరిపిన ఎన్ఐఏ అధికారులు అలీషాహ్ పార్కర్ ను గతంలోనే ప్రశ్నించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్ ను అధికారులు దాఖలు చేశారు. అందులో అలీషాహ్ వెల్లడించిన వివరాలను పొందుపరిచారు. కరాచీలోని డిఫెన్స్ కాలనీలో ఘాజీ బాబా దర్గా ఏరియాలో ఉంటున్నాడని పార్కర్ చెప్పాడు.

More Telugu News