Uttar Pradesh: ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య.. ఆపై సెప్టిక్ ట్యాంకులో పూడ్చివేత!

  • యూపీలోని బులంద్ షహర్ నుంచి రెండేళ్ల క్రితం నోయిడా వచ్చిన బాధితుడి కుటుంబం
  • తాపీమేస్త్రీతో హతుడి భార్య వివాహేతర సంబంధం
  • భర్త ఉంటే ఆటలు సాగవని ప్రియుడితో కలిసి హత్య
Wife Killed Husband with lover in Noida

ప్రియుడి మోజులో పడిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంకులో పూడ్చేసి మాయచేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పోలీస్ స్టేషన్‌లో ఊచలు లెక్కబెట్టుకుంటోంది. నోయిడాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌కు చెందిన సతీశ్ రెండేళ్ల క్రితం భార్య నీతు, ఐదేళ్ల కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం నోయిడా వచ్చాడు. తాజాగా స్థానిక సరస్వతి కుంజ్‌లో సొంత ఇంటిని కట్టుకుంటున్నాడు. ఇంటి నిర్మాణం కోసం కుదుర్చుకున్న తాపీ మేస్త్రీ  హర్పాల్‌తో నీతూకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఉంటే తమ ఆటలు సాగవని భావించిన నీతు.. ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ నెల 2న మద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడి సాయంతో గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి పక్కనే నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడేసి పూడ్చేసి ప్లాస్టరింగ్ చేశారు. తన సోదరుడు సతీశ్ జాడ లేకపోవడంతో అతడి సోదరుడు ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నీతూను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె సమాధానాలు అనుమానాస్పదంగా ఉండడంతో గట్టిగా ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగు చూసింది. దీంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

More Telugu News