Vishnu Vardhan Reddy: ఏపీ రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారా?: విష్ణువర్ధన్ రెడ్డి

  • రాబోయే ఎన్నికల్లో వైసీపీ అజెండా ఏమిటో చెప్పాలన్న విష్ణువర్ధన్ రెడ్డి
  • ఏపీని రెండు, మూడు ముక్కలు చేసేటట్టున్నారని మండిపాటు
  • ధర్మాన, జగన్ ఇద్దరి అజెండా ఒకటేనా అని ప్రశ్న
Vishnu Vardhan Reddy demands Jagan to explain YSRCP genda

రాబోయే ఎన్నికల్లో వైసీపీ అజెండా ఏమిటో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ చెప్పాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల మంత్రి ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలను చూసినట్టయితే 2024 నాటికి ఏపీని రెండు లేదా మూడు రాష్ట్రాలు చేసేటట్టున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ధర్మాన మాట్లాడారని విమర్శించారు. 

2024లో జగన్, ధర్మాన ఇద్దరి అజెండాలు ఒకటేనా? అని ప్రశ్నించారు. ఇవి కేవలం ధర్మాన వ్యక్తిగత వ్యాఖ్యలేనా? లేక వైసీపీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ధర్మానను మంత్రి పదవి నుంచి తొలగించాలని అన్నారు. 

వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహుల్లా తయారయ్యారని, ప్రజల మధ్య తగాదాలు పెట్టి చలికాచుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో దోచుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయడం మినహా మరేం జరగడం లేదని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే వైసీపీ పోవాలని, బీజేపీ రావాలని అన్నారు.

More Telugu News