Samantha: ఇది ఏడవడం కాదు..ఎమోషన్: 'శాకుంతలం' ట్రైలర్ లాంచ్ ఈవెంటులో గుణశేఖర్

  • గుణశేఖర్ నుంచి దృశ్య కావ్యంగా 'శాకుంతలం'
  • కొంతసేపటి క్రితం జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • ఈ సినిమాకి హీరో సమంత అని చెప్పిన గుణశేఖర్ 
  • లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని వ్యాఖ్య
 Shaakuntalam Trailer launch Event

చాలా గ్యాప్ తరువాత గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను రూపొందించారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. గుణశేఖర్ తో పాటు దిల్ రాజు .. సమంత .. దేవ్ మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ .. 'శాకుంతలం' సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు. కథకి నాయకుడిగా దేవ్ మోహన్ హీరో అయితే .. సినిమాకి హీరో సమంత .. సినిమా వెనుక హీరో దిల్ రాజు గారు. ఈ సినిమా క్రెడిట్ మాత్రం దిల్ రాజుగారికి ఇస్తున్నాను" అంటూ ఒక్కసారిగా ఆయన ఎమోషనల్ అయ్యారు. 

గుణశేఖర్ కన్నీళ్లు  పెట్టుకోగానే అక్కడి వాతావారణం ఒక్కసారిగా మారిపోయింది. గుణశేఖర్ తేరుకుని .. "సారీ .. ఇది ఏడవడం కాదు .. ఒక ఎమోషన్. మనలాంటివారు ఒక మాంచి సినిమా తీయాలంటే మంచి మేకర్స్ అవసరం. ఒక ఎమ్మెస్ రెడ్డి గారు .. అశ్వనీదత్ గారు .. దిల్ రాజు గారులాంటి వారు వెనుక ఉంటేనే మేము అనుకున్నది తీయగలం. ఈ రోజున నాకు దిల్ రాజు గారు దొరికారు. అందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను" అన్నారు.

ఈ సినిమాకి ప్రోపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది. ఏడాదిపాటు ప్రీ ప్రొడక్షన్ చేశాను ..   6 నెలలు షూటింగు చేశాను .. ఏడాదిన్నర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా వచ్చేవరకూ తీస్తూనే ఉన్నాము. 'ఏ విషయంలోను రాజీ పడొద్దు .. నేను ఉన్నాను .. మీరు ముందుకు వెళ్లండి' అంటూ దిల్ రాజు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే కాస్త ఎమోషనల్ అయ్యాను" అన్నారు. 

శకుంతల పాత్ర కోసం ఎంతోమందిని అనుకున్నాను. కానీ ఈ సినిమాకి నాయికగా సమంత కరెక్ట్ అని మా అమ్మాయి చెప్పింది. ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ కథలకు సంబంధించి ఇంతవరకూ వచ్చిన సినిమాలలో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. రేపటి రోజున భవిష్యత్ తరాలవారికి ఈ సినిమా ఒక రిఫరెన్స్ కావాలనే ఉద్దేశంతో ఎంతో కేర్ తీసుకున్నాము. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకున్నాము. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని భావిస్తున్నాను" అంటూ ముగించారు.

More Telugu News